వైశాఖ శుద్ధ ఏకాదశి : అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం
శ్రీ సత్యనారాయణ స్వామివారు, అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారితో కలసి కొలువు తీరిన ప్రదేశం. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. అన్నవరం ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం.
కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా.
ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుల పండుగగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం.
ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది.
"హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప" అంటూ రాసిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈరోజు అన్నవరంలోనే కాక
పేరూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం,
అత్తిలి, అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.
