పెళ్లయిన వెంటనే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయమంటారు?
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ. పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు.
గృహప్రవేశం చేసినప్పుడు, ఇతర శుభకార్యాల సందర్భంలో, ముఖ్యంగా కార్తీకమాసంలో కూడా ఈ వ్రతాన్ని విధిగా ఆచరించడం మన సంప్రదాయం.
కానీ ఎందుకు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేయాలని పెద్దలు చెబుతారో చాలామంది ఆలోచించరు. సంప్రదాయంగా మాత్రమే కొనసాగించే వారు ఎందరో ఉన్నారు.
సత్యనారాయణ స్వామి వ్రతం మనకు దేవర్షి నారద మహర్షి ద్వారా లభించిన మహత్తర వరం. లోకక్షేమం కోసం ఆయన అందించిన ఎన్నో వ్రతాలలో ఇది అత్యంత పవిత్రమైనది.
ఈ వ్రతాన్ని జాతి, మత, కుల భేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. స్త్రీలు కూడా నిరభ్యంతరంగా ఈ వ్రతాన్ని చేయవచ్చు.
ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగి, సకల సంపదలు, సౌభాగ్యాలు, సంతానం మరియు శుభఫలితాలు కలుగుతాయని స్వయంగా శ్రీమహావిష్ణువు నారదునికి ఉపదేశించినట్లు పురాణాలలో పేర్కొనబడింది.
శ్రీ సత్యనారాయణుడు కేవలం విష్ణు స్వరూపమే కాదు. ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవంగా భావించబడతాడు.
మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్యేక్య రూపాయ తే నమః
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్యేక్య రూపాయ తే నమః
వివాహం అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభించే దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, వారి దాంపత్య జీవితం ఆనందమయం కావాలని, శ్రీ సత్యనారాయణ స్వామివారి అనుగ్రహం పొందాలని ఈ వ్రతాన్ని ముందుగా ఆచరింపజేస్తారు.
అలాగే గర్భాదానానికి ముందుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్సంతానం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు.
అందువల్లే నూతన దంపతుల చేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా ఆచరింపజేయడం మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక విశిష్టమైన ఆచారంగా కొనసాగుతోంది.
