Ads Area

ఆరవీడు గ్రామానికి ఆ పేరెలావచ్చందంటే...!

0

 ఆరవీడు గ్రామానికి ఆ పేరెలావచ్చందంటే...!




కాకతీయుల కాలంలో ఉత్తరాది దక్కను నుండి మహరాష్ట్రులు కొందరు శ్రీశైల ప్రాంతానికి వచ్చి స్థిరపడినారు. వారు అరె కుటుంబాలకు చెందినవారు.

 కాకతీయ రుద్రమదేవిని వివాహం చేసుకొన్నవాడు నిడదవోలు చాళుక్యవంశానికి చెందిన వీరభద్రుడు. వీరభద్రుని మంత్రి విష్ణువు.విష్ణువు కొన్ని దానాలను చేశాడని తణుకు నరసాపురం శాసనాలు తెలియచేస్తున్నాయి. ఆ శాసనాలలో అరె కుటుంబాల ప్రస్తావన వుంది. 

మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అరె కుటుంబాలు శ్రీశైలభూమికి వలస వచ్చినందువలన ఈ ప్రాంతం అరెప్రాంతం, అరెభూమి, అరెవీడు అయింది. అరె వంశీయులలో రాణక గోపదేవరాజు ప్రముఖుడు.ఇతను కాకతీయుల సేనాని. 1273 నాటి గుండ్లపాడు శాసనంలో ఇతని ప్రస్తావన వుంది.

వీడు అనగా నివాసం, ఇల్లు గ్రామం అనే అర్థముంది. ఇలా అరె కుటుంబాల పేరు మీదుగా అరెవీడు గ్రామం ఏర్పడింది. కాలగమనంలో ఉచ్ఛరణలో అరెవీడు ఆర్వీడు, ఆర్వేడు అయింది.

17, 18 శతాబ్దాలలో మహరాష్ట్రులు బళ్ళారి, గుత్తి, చెంజి (జింజి) తంజావూరులపై ఆధిపత్యం వహించిపాలించారు.గుత్తి (జగతాపిదుర్గం) ని పాలించినవాడు మురారిరావు. ఇతనికాలంలో అనేక మంది మహరాష్ట్రులు దళపతులుగా, సైనికులుగా, వృత్తి పనివారలుగా అనంతపురం జిల్లాలో స్థిరపడటం జరిగింది. వారిలో అరె, రంగ్రాజు వారున్నారు. అరెలో కటికవారు అరెకటికవారైనారు. రంగ్రాజుల వృత్తి అద్దకం. గుత్తికి దగ్గరలోని పామిడి గ్రామంలో అత్యధికంగావున్న మరాఠివారి వృత్తి జౌళివ్యూపారం.

విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ,సాలువ, తుళువ, ఆర్వీటి వంశాలు పాలించాయి. ఆర్వీటి వంశపాలన ఆళియ రామరాయలు, తిరుమలరాయలు, రామరాయలు, శ్రీరంగదేవరాయలు ముఖ్యులు.

కాకతీయ రుద్రమదేవికి ముగ్గురు కుమార్తెలు. ముమ్మిడమ్మ, రుద్రమ. రుయ్యమ్మ. ముమ్మిడమ్మ భర్త కాకతీయవంశానికి చెందిన మహదేవుడు. ఇతను రుద్రమదేవికి వరుసకు తమ్ముడో మేనల్లుడో అయివుండవచ్చును. రుద్రమను యాదవరాకుమారుడు ఎల్లనదేవుడు పెండ్లి చేసుకొన్నాడు.

మూడవ కుమార్తైన రుయ్యమ్మను ఇందులూరినాయకుడు అన్నయ వివాహమాడాడు. ముమ్మిడమ్మ కుమారుడే రుద్రుడు (ప్రతాపరుద్రుడు) ఇతనే కాకతీయచివరి చక్రవర్తి.


జి.బి.విశ్వనాథ.గోరంట్ల. అనంతపురం జిల్లా.9441245857.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area