GET MORE DETAILS

ఇంట్లో నోట్ల గుట్టలు , లెక్కిస్తే రూ.150కోట్లకు పైనే. షాకైన అధికారులు

 ఇంట్లో నోట్ల గుట్టలు , లెక్కిస్తే రూ.150కోట్లకు పైనే. షాకైన అధికారులు

 


పన్ను ఎగవేత ఆరోపణలపై ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు నోట్ల గుట్టలు కన్పించాయి. దీంతో షాకైన అధికారులు వాటిని లెక్కించగా.. రూ.150కోట్లకు పైనే తేలిందట. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

కాన్పూర్‌కు చెందిన ఓ పర్ఫ్యూమ్‌ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థ యజమాని పీయూష్‌ జైన్‌ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్‌గా ప్యాక్‌ చేసిన కరెన్సీ నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే బ్యాంక్‌ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించారు. నిన్న సాయంత్రం నుంచి ఈ లెక్కింపు కొనసాగగా.. శుక్రవారం ఉదయం నాటికి రూ.150కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న జీఎస్‌టీ అధికారులు కూడా ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ సొమ్మును నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. ఊహాజనిత కంపెనీల ద్వారా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్‌టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది. పీయూష్‌ ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని ఆయన కార్యాలయాలు, గోదాముల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ఓ వేర్‌హౌస్‌లో 200 నకిలీ ఇన్‌వాయిస్‌లు ఉన్న నాలుగు ట్రక్కులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments