ఫిట్మెంట్పై సీఎం జగన్కు పదకొండు ప్రతిపాదనలు: సీఎస్ సమీర్ శర్మ
పీఆర్సీ, ఫిట్మెంట్పై కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదికను సీఎస్ సమీర్ శర్మ, కమిటీ సభ్యులు కలిసి తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు అందించారు. నివేదికను సీఎం జగన్ పరిశీలించిన అనంతరం సచివాలయంలో సీఎస్ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ, ఫిట్మెంట్పై వివరాలు వెల్లడించారు.
‘‘ఫిట్మెంట్పై సీఎం జగన్కు 11 ప్రతిపాదనలు ఇచ్చాం. పీఆర్సీ నివేదికను వెబ్సైట్లో ఉంచుతాం. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్మెంట్ను పరిశీలించాం. పీఆర్సీ, ఫిట్మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 7 రకాల సిఫార్సులు చేశాం. నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలి.. 5 అంశాలను మార్పులతో అమలు చేయాలి.. 2 అంశాలను అమలు చేయక్కర్లేదు... ఇలా ప్రతిపాదనలు సూచించాం. 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 23శాతం ఫిట్మెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 27 శాతం ఫిట్మెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 14 శాతం ఫిట్మెంట్, 11 పీఆర్సీ ప్రతిపాదనలతో పాటు 30 శాతం ఫిట్మెంట్.. ఇలా 7 రకాల ప్రతిపాదనలు రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఈ ఏడింటిలో ఏదో ఒక ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకూ ఫిట్మెంట్ సిఫార్సు చేశాం. అధికారులు, నిపుణులతో చర్చించాక ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలన్న దానిపై సీఎం జగన్ 3 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. పెండింగ్ డీఏలపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని సీఎస్ వివరించారు.
ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు.
‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విభజన పెను ప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215గా ఉంది. రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఉన్న రూ. 18,969.26 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. రూ.20 వేల కోట్ల అదనపు భారం పడింది. ఇంతటి కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. జులై 1, 2019 నుంచి 27 శాతం ఐఆర్ను ఇచ్చింది. ఐఆర్ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంగన్వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులతో కలిపి మొత్తంగా 3,01,021 మంది ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లుకు పెరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ విభాగాలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు తదితర ఉద్యోగులకూ వర్తింపజేసింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 360 కోట్ల మేర ఏడాదికి అదనపు భారం పడుతోంది’’ అని సీఎస్ తెలిపారు.
0 Comments