రక్షణ దళాల్లో దూసుకుపోదాం _ అమ్మాయిలకూ ఎన్డీఏ ఆహ్వానం
రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగం ఆశించే యువత కోసం మేటి అవకాశం ఎదురుచూస్తోంది. యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ అండ్ ఎన్ఏ 2022(1) ప్రకటన తాజాగా వెలువడింది. అమ్మాయిలు సైతం వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులూ, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ, మౌఖిక పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారిని బీఏ/బీఎస్సీ/బీటెక్ చదివించి, శిక్షణ అందించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. వీరు ఆర్మీ/ నేవీ/ ఏర్ఫోర్స్ విభాగాల్లో లెవెల్-10 హోదాతో విధులు నిర్వర్తించవచ్చు!
రక్షణ రంగానికి చెందిన నియామక పరీక్షల్లో నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ), నేవల్ అకాడెమీ (ఎన్ఏ) అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఈ విధానంలో ఎంపికైనవారు అత్యుత్తమ ఉద్యోగం సొంతం చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో త్రివిధ దళాలకు అధిపతి కావడానికీ అవకాశాలున్నాయి. దీన్ని ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఇందులో మెరిసినవారు నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, పుణెలో బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు, నేవల్ అకాడెమీలో బీటెక్ చదువుకోవచ్చు. వసతి, భోజనం, బట్టలు...అన్నీ ఉచితమే. విజయవంతంగా చదువు పూర్తిచేసుకున్నవారికి జేఎన్యూ, న్యూదిల్లీ పట్టాలు అందిస్తుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ఆయా విభాగాలకు చెందిన ట్రేడ్ శిక్షణ ఉంటుంది. ఈ వ్యవధిలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ అందుకోవచ్చు.
రాతపరీక్ష ఇలా...
దీన్ని మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో మ్యాథ్స్ 300 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. పేపర్-2లో 600 మార్కులకు జనరల్ ఎబిలిటీ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు అంటే ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో పార్ట్- ఎ ఇంగ్లిష్కు 200, పార్ట్- బి జనరల్ నాలెడ్జ్కి 400 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.
* జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 15, జనరల్ సైన్స్ 10, చరిత్ర, స్వాతంత్య్రోద్యమాలు 20, భూగోళశాస్త్రం 20, వర్తమానాంశాల నుంచి 10 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
* తప్పుగా గుర్తించిన సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు.
* పరీక్షలో అర్హత పొందడానికి ప్రతి సబ్జెక్టులోనూ 25 శాతం మార్కులు తప్పనిసరి.
* ఇలా అర్హత సాధించినవారిలో మెరిట్ ప్రకారం కొందరిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు.
* ఇందులో భాగంగా గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, అవుట్డోర్ గ్రూప్ టాస్క్లు ఉంటాయి. అయిదు రోజులపాటు రెండంచెల్లో వీటిని నిర్వహిస్తారు. తొలిరోజు పరీక్షల్లో అర్హత సాధించినవారికే మిగిలిన నాలుగు రోజుల టాస్క్, ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
సన్నద్ధత ఎలా...?
* ఈ పరీక్ష ఎంపీసీ విద్యార్థులకు కొంత సౌకర్యంగా ఉంటుంది. ఈ గ్రూపు నుంచే 460 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన గ్రూపులవారు మ్యాథ్స్, సైన్స్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
* కొత్తగా సన్నద్ధమవుతోన్న అభ్యర్థులు ముందుగా ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలను చదివి, ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. సంబంధిత సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ 11, 12 తరగతుల పుస్తకాలు అధ్యయనం చేయాలి.
* పాఠ్యాంశాలు చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఏ చాప్టర్లకు ప్రాధాన్యం ఉందో గమనించి సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి.
* చదవడం పూర్తయిన తర్వాత మాక్ పరీక్షలు మొదలు పెట్టాలి. కనీసం పదైనా రాయాలి. వీటిని రాస్తున్నప్పుడే సమయానికి ప్రాధాన్యమివ్వాలి. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో గుర్తించి, ఆ అంశాలను మరోసారి బాగా చదవాలి.
* రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి తెలియని ప్రశ్నలను వదిలేయాలి. అలాగే ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలను ఆఖరులోనే ప్రయత్నించాలి. ముఖ్యంగా మ్యాథ్స్ విభాగంలో ప్రశ్నలతో ఇబ్బందులు రావచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించడమే దీనికి పరిష్కారం.
* గణితంలోని ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి సారించాలి. ఈ పేపర్లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 30, ట్రిగనోమెట్రీ 30, కాల్క్యులస్ 20, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 20, ప్రాబబిలిటీ 10, కాంప్లెక్స్ నంబర్స్ 10 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల వీటిని అధిక ప్రాధాన్యంతో చదవాలి.
* ఫిజిక్స్లో కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. సూత్రాలు, అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి.
* కెమిస్ట్రీలో మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలపై దృష్టి సారించాలి.
* మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలకు ఎంసెట్, జేఈఈ మెయిన్స్ సన్నద్ధత పనికొస్తుంది. వీటి పాత ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.
* ఆంగ్లంలో వ్యాకరణం, పదసంపదలకు ప్రాధాన్యం ఉంది. ఇందుకోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించుకుని వీలైనన్ని కొత్త పదాలను తెలుసుకోవాలి. వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చమనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అర్థాలు, వ్యతిరేకపదాలు, తప్పుని గుర్తించడం, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, కాంప్రహెన్షన్, ఖాళీని పూరించడం... ఈ విభాగాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. ప్రాథమిక వ్యాకరణాంశాలపై పట్టు పెంచుకున్నవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు.
* కరెంట్ అఫైర్స్ విభాగంలో పరీక్ష తేదీ నుంచి 9 నెలల వెనుక వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో నెలకొన్న కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. ప్రామాణిక వార్తాపత్రికను ప్రతిరోజూ చదివి ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకోవాలి.
పుస్తకాలు :
* టాటా మెక్ గ్రాహిల్స్/ అరిహంత్ పుస్తకాలను పరిశీలించవచ్చు.
* జీకే ప్రశ్నలకు లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది.
* మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు పాఠ్యపుస్తకాలు సరిపోతాయి.
* చరిత్ర, భూగోళశాస్త్రం, జనరల్ సైన్స్ విభాగాల్లోని ప్రశ్నలకు ఆయా సబ్జెక్టుల్లో ఎన్సీఈఆర్టీ 8,9,10 తరగతులతోపాటు ప్లస్ 1, 2 పుస్తకాలు చదివితే ఎక్కువ ప్రయోజనం.
చదువు, శిక్షణ :
ఎన్డీఏకు ఎంపికైనవారికి నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ), పుణెలో మూడేళ్ల పాటు చదువు, శిక్షణ అందిస్తారు.
* ఆర్మీని ఎంచుకున్న వారు బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్)/ బీఏ కోర్సుల్లో ఏదైనా చదువుకోవచ్చు.
* నేవీకి ఎంపికైతే బీటెక్, ఏర్ఫోర్స్ అభ్యర్థులు బీఎస్సీ లేదా బీటెక్ విద్య అభ్యసిస్తారు.
* నేవల్ అకాడెమీకి (10+2 టెక్నికల్ క్యాడెట్ ఎంట్రీ స్కీం) ఎంపికైనవారు ఎజమాళ, కేరళలోని నేవల్ అకాడెమీలో నాలుగేళ్లపాటు బీటెక్ విద్య అభ్యసిస్తూ శిక్షణ పొందుతారు.
* ఎన్డీఏలో మూడేళ్ల శిక్షణ, చదువు అనంతరం ఆర్మీ క్యాడెట్లను దేహ్రాదూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమాలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఏర్ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్లోని ఇండియన్ ఏర్ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు.
* ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఏర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ (పైలట్) హోదాతో వీరు కెరియర్ ప్రారంభిస్తారు.
మొత్తం ఖాళీలు: 400
ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో 370, నేవల్ అకాడెమీ (10+2 క్యాడెట్ స్కీం)లో 30 ఉన్నాయి. నేషనల్ డిఫెన్స్ అకాడెమీకి సంబంధించి ఆర్మీ 208 (పది మహిళలకు), నేవీ 42 (మూడు మహిళలకు), ఏర్ఫోర్స్ - ఫ్లయింగ్ 92 (రెండు మహిళలకు), గ్రౌండ్ డ్యూటీ టెక్ 18 (రెండు మహిళలకు), గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్ 10 (రెండు మహిళలకు) ఉన్నాయి. నేవల్ అకాడెమీలోని 30 ఖాళీలూ పురుషులకే కేటాయించారు.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూప్తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏర్ ఫోర్స్, నావల్ వింగ్స్ (ఎన్డీఏ), 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నావల్ అకాడమీ) ఖాళీలకు ఎంపీసీ గ్రూప్తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 2, 2003 - జులై 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు.
శారీరక ప్రమాణాలు: ఎత్తు 157 సెం.మీ., ఏర్ఫోర్స్కు 163 సెం.మీ. ఉండాలి. తగిన బరువు అవసరం.
ఆన్లైన్ దరఖాస్తులు: జనవరి 11 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.
ఫీజు: రూ.వంద. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 10
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్.
వెబ్సైట్: https://upsc.gov.in/
కటాఫ్ తక్కువే...
2021 ఎన్డీఏ అండ్ ఎన్ఏ (1)లోనూ 400 ఖాళీలే ఉన్నాయి. 900 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 343 పొందినవారు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. తుది నియామకాల్లో 1800 (పరీక్షకు 900, ఇంటర్వ్యూకు 900) మార్కులకు గానూ 709 వచ్చినవారు ఏదో ఒక విభాగంలో అవకాశం పొందారు. 2020 ఎన్డీఏ అండ్ ఎన్ఏ (1) పరీక్షలో 355 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు, తుది నియామకాల్లో 723 మార్కులు వచ్చినవారు ఏదో ఒక సర్వీస్కు ఎంపికయ్యారు.
ఫలితాలను గమనిస్తే మొత్తానికి 45 శాతం మార్కులతో ఎన్డీఏ అండ్ ఎన్ఎలో కచ్చితంగా పాగా వేయవచ్చు.
ఇవీ ప్రయోజనాలు...
ఎన్డీఏతో ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్స్ల్లో ఎందులో అవకాశం వచ్చినప్పటికీ వేతనం, హోదాలు సమానంగానే ఉంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి చేరిన తర్వాత అందరికీ లెవెల్ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి అదనంగా మిలటరీ సర్వీస్ పే రూ.15,500 అన్ని విభాగాలవారికీ చెల్లిస్తారు. డీఏ, హెచ్ఆర్ఏ, పలు ఇతర ప్రోత్సాహకాలు అందరికీ దక్కుతాయి. ఆర్మీలో చేరినవారికి లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఏర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు కేటాయిస్తారు. రెండేళ్ల అనుభవంతో పదోన్నతి పొందవచ్చు. ఆరేళ్ల తర్వాత మరొకటి, పదమూడేళ్లకు మరో పదోన్నతి దక్కుతుంది. అంటే 13 ఏళ్లు పనిచేసినవాళ్లు ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్స్ల్లో వరుసగా.. లెఫ్టినెంట్ కల్నల్, కమాండర్, వింగ్ కమాండర్ స్థాయికి చేరుకుంటారు. అనంతరం ప్రతిభ ప్రాతిపదికన మిగిలిన హోదాలు దక్కుతాయి.
ఇంటర్వ్యూలో...
అభ్యర్థి రక్షణ రంగంలో కొనసాగగలరా లేదా తెలుసుకుంటారు. తెలివితేటలతోపాటు దృఢ సంకల్పం, మానసిక పరిణతి కనబరిచినవారికి అవకాశం ఉంటుంది. నాయకత్వ నైపుణ్యాలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలిస్తారు. ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పాలి. భారత రక్షణ రంగంపై ఆవగాహన ఉండాలి. అభ్యర్థుల నేపథ్యంపైనా ప్రశ్నలుంటాయి.
0 Comments