GET MORE DETAILS

కాకులకు మాత్రమే ఎందుకు పిండం పెడుతారు _ కాకులు నేర్పే అధ్వైతంమేమిటి ?

 కాకులకు మాత్రమే ఎందుకు పిండం పెడుతారు _ కాకులు నేర్పే అధ్వైతంమేమిటి ?



ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామి వారిని, “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము ?మన పూర్వీకులు కాకులుగా మారారా ?  అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు ? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు ?” అని అడిగాడు.

స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా ? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా ? లేదు..! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.

క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి  ‘కా కా’ అని పిలిస్తే., కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!

విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు.. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.

అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది.. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది. 

అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా ? అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేక లక్షణం కలిగినది.

మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కా కా అని అంటుంది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా... అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.

ఇది ఎంతమంది పాటిస్తున్నారు ?

కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు. మరొక్క విషయం... కేవలం మహాలయం లోనే కాదు.., ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.

కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది :

నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది.. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు.

ఇది వినగానే ఆ భక్తుడు, అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి, అందరూ ఒక్కసారిగా “జయ జయ శంకర, హర హర శంకర” అని పెద్దగా పలికారు. పరమాచార్య స్వామివారి అద్భుతమైన అందమైన విశ్లేషణను మనమందరం పాటించి మన పూర్వీకుల ఆశీస్సులను పొందుదాము.

Post a Comment

0 Comments