GET MORE DETAILS

ఆమె మాటే తూపాకి తూటా: కామ్రేడ్ స్వరాజ్యం అమర్ రహే

ఆమె మాటే తూపాకి తూటా: కామ్రేడ్ స్వరాజ్యం అమర్ రహే



మల్లు స్వరాజ్యం.. తొలి దశ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆమెది చెరగని సంతకం. పదమూడేళ్ల వయస్సులోనే పోరుబాట పట్టి పల్లెపల్లె తిరిగిన ఆమె.. పదహారేళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం బందూక్​ చేతబట్టారు.

పుట్టింది దొరల కుటుంబంలోనైనా ఆ దొరస్వామ్యంపైనే తిరుగుబాటు జెండా ఎత్తారు. 'బాంచెన్​ దొర.. నీ కాల్మొక్తా' అంటూ బానిసత్వంలో మగ్గిన మట్టి మనుషులతో దళం కట్టారు. నిజాం నిరంకుశత్వాన్ని నిరసించారు. అతడి తాబేదారులుగా ఉంటూ ప్రజలను హింసిస్తున్న దొరలు, దేశ్‌ముఖ్‌లపై పోరాడారు.

తల్లి ప్రేరణతో సామ్రాజ్యం నుంచి స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం మొదటి పేరు సామ్రాజ్యం. ఆమె తండ్రి మొదట బ్రిటిష్​ సామ్రాజ్యానికి అనుకూలంగా ఉండేవారు. అందుకే ఆమెకు సామ్రాజ్యం అని పేరు పెట్టారు. అయితే స్వాతంత్రోద్యమం స్ఫూర్తితో ఆమె తల్లి చొక్కమ్ స్వరాజ్యం అని పేరు మార్చారు. తల్లి జీవితం నుంచి మల్లు స్వరాజ్యం స్ఫూర్తి పొందారు. మహిళలు.. పురాణాలు, మతగ్రంథాలకే పరిమితమైన ఆ రోజుల్లోనే మాగ్జిమ్ గోర్కీ వంటి రచయిత 'అమ్మ' వంటి పుస్తకాలను కుమార్తెకు అందుబాటులకోకి తెచ్చారు చొక్కమ్మ. దున్నే వాడికే భూమి కావాలని, వెట్టి చాకిరీ పోవాలని 12 ఏళ్ల వయస్సులోనే దొరల పాలనను వ్యతిరేకించారు. ఇలా వ్యతిరేకించినా మల్లు స్వరాజ్యం స్వయంగా దొరల కుటుంబానికి చెందినవారే. చిన్న వయసులో తన ఇంట్లో పని చేస్తున్న దళితులకు భోజనం పెట్టారు మల్లు స్వరాజ్యం. అయితే ఇంట్లో పెద్దలు మందలించారు. కానీ ఆకలితో ఉన్నోళ్లకు అన్నం ఎందుకు పెట్టొద్దని ఎదురు తిరిగారు స్వరాజ్యం. అప్పట్నుంచే ఆమె పోరాటం ప్రారంభమైందిని అనుకోవచ్చు.

ఆంధ్రమహాసభ ఆవిర్భావంతో కీలక మలుపు

ప్రజలకు కూలీ కూడా ఇవ్వకుండా దొరలు తమ సొంత భూముల్లో వెట్టి చేయించుకునేవాళ్లు. దానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమించింది. ఇప్పటి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండిలో గొర్రెల కాపరి దొడ్డి కొమురయ్యను విసునూర్​ దేశ్‌ముఖ్‌ ​ రామచంద్రారెడ్డి హత్య చేయడంతో తిరుగుబాటు మరింత రాజుకుంది. ఇలా రగిలిన ఉద్యమం వరంగల్, నల్గొండ, ములుగు, నర్సంపేట, కరీంనగర్​, ఆదిలాబాద్​ వరకు అంటుకుంది. ఆ ఉద్యమంలో మల్లు స్వరాజ్యం పాత్ర గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ధర్మపురం తండాలో ఆరుట్ల రామచంద్రారెడ్ని పోలీసులు రైస్​మిల్లులో బంధిస్తే.. ప్రజలను కూడగట్టి మిల్లుపై దాడి చేసి విడిపించడంలో మల్లు స్వరాజ్యం పేరు మార్మోగిపోయింది.

మల్లు స్వరాజ్యం తలపై రూ. పదివేల రివార్డు ప్రకటించిన నిజాం

మల్లు స్వరాజ్యం సోదరుడు కమ్యూనిస్టు నేత భీంరెడ్డి నర్సింహారెడ్డితో పాటు రావి నారాయణరెడ్డి మాటల ప్రభావం కూడా తనపై చాలా ఉందని మల్లు స్వరాజ్యం చెప్పేవారు. రైతాంగ సాయుధ పోరాటంలో చాలా మంది భూస్వాముల పిల్లలూ కీలక పాత్ర పోషించారు. రైతులు, కూలీలపై దొరల ఆగడాలను సహించలేక 16 ఏళ్లకే తుపాకీ చేత పట్టిన మల్లు స్వరాజ్యం ప్రత్యేక దళాన్ని నిర్వహించారు. మల్లు స్వరాజ్యం దళంలో 20 నుంచి 30 మంది ఉండేవారు. అప్పటి ఆర్మీ మేజర్​ జైపాల్​ సింగ్​ మల్లు స్వరాజ్యం దళానికి తుపాకీ పేల్చడంలో ట్రైనింగ్​ ఇచ్చారు. అప్పట్లో మల్లు స్వరాజ్యం తలపై నిజాం ప్రభుత్వం 10 వేల రూపాయల రివార్డు ప్రకటించింది. అయినా మల్లు స్వరాజ్యం ఎప్పుడూ పట్టుబడలేదు. ప్రజలే మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని ఆమె గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ఐద్వా వ్యవస్థాపక అధ్యక్షురాలు

నిజాం గద్దె దిగిపోయిన తర్వాత కూడా మల్లు స్వరాజ్యం రైతుల కోసం పోరాడారు. అధికారం నిజాం చేతుల నుంచి యూనియన్ సై ​సైన్యాల చేతుల్లోకి పోయింది కానీ ప్రజలకు దొరలు, దేశ్‌ముఖ్‌ల పీడన పోలేదని ఆమె భావించారు. పేదలకు పంచిన భూములు లాక్కూండటంతో మళ్లీ పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటంలో 40 మంది కమ్యూనిస్టు నాయకులు, మూడున్నర వేల మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని మల్లు స్వరాజ్యం గుర్తు చేసుకుంటూ ఉంటారు.

మల్లు స్వరాజ్యం 1981లో ఏపీ ఐద్వాను స్థాపించారు. 2001 వరకు అధ్యక్షురాలిగా ఉన్నారు. జీవిత పోరాట యోధురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుత యువతలో చైతన్యం లేకపోవడంపై బాధపడేవారు

మట్టి పిసికిన రైతులు, కూలీలు ఆయుధాలు ఎందుకు చేతపట్టారన్న విషయం ఇప్పటి తరానికి తెలియదని.. ఈ పోరాట చరిత్రను స్కూళ్లలో చెప్పరని పలు సందర్భాల్లో స్వరాజ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లో చదువులేకపోయినా పాటలతో, మాటలతో ప్రజలను చైతన్య పరిచామని నేడు కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలను బానిసలుగా మారుస్తున్న్నారని ఆమె ఆవేదన చెందేవారు. 1978, 1983లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి గెలిపించారని కానీ ఇప్పుడు ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్లకే ఓటేస్తున్నరు. చదువు, చైతన్యం ఉండి కూడా డబ్బుల మాయలో పడి దోచుకునే వారికే ఓటు వేసి గెలిపిస్తుండడం చూస్తుంటే చాలా బాధ​కలుగుతుందని ఆమె చివరిరోజుల్లో బాధపడేవారు.

Post a Comment

0 Comments