GET MORE DETAILS

వైశాఖ పురాణం - 10 వ అధ్యాయము

వైశాఖ పురాణం - 10 వ అధ్యాయము




దక్షయజ్ఞనాశము కామదహనము :

రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను.

ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు , వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు , రాక్షసులు , మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్ళి శరణు వేడిరి.

బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరిని శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రతికింపజేసెను , శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రతికించెను , మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి ఆ అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు.

యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి.

యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను.

దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను.

ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరివలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును ?  కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను , సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను , తన గృహములునూడ్చుటకును, దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగ బాధించుచుండెను.

దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగ ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని యిట్లు పలికెను. దేవతలారా ! నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి యెవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షునియజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసికొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యూరడించి పంపెను.

దేవతలందరును యఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును, నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును , మనధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.

ఇంద్రుడు - నారదుని జూచి నారదమహర్షీ ! నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమొనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయశృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని భోదింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగ హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగ హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను.

నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనముపోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను.

మన్మధుడును ఇంద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను , భార్యయగు రతీదేవితోను , మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను.

అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్దము , మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్దముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటయేమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను.

బాణప్రయోగమొనర్పబోవు మన్మధుని జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను.

తమ కార్యమేమగునోయని చూచుచున్నదేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు , మన్మధుని భార్య రతి - శివుడు తమను కూడ శిక్షించునేమో ? ఆ శిక్షయెట్లుండునోయని భయపడి కనులను మూసికొని దూరముగ పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంత్ర్దాన మయ్యెను.

మన్మధుడు చేసినపని దేవతలకు , శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో యెవరు చెప్పగలరు ?

కావున శ్రుతకీర్తి మహారాజు ! ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని , అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసినదానికి శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధలయెడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలుపడెను.

పరమపుణ్యప్రదమైన ఈ కధను , రాత్రిగాని , పగలుగాని యెవరు విన్నను , జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగు భయములనుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదులవలన భయము నుండదు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను.


వైశాఖ పురాణం  పదవ అధ్యాయం  సంపూర్ణం

Post a Comment

0 Comments