GET MORE DETAILS

లక్ష్మీదేవి తోడు నలుగురు...!!

లక్ష్మీదేవి తోడు నలుగురు...!!



లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని   వేడుకుంది.

"స్వామీ.. మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్దకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ.

కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా? సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను కనికరించండి" అని మొరపెట్టుకుంది. 

అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు.....

"నువ్వు భయపడకు. నీకు తోడుగా నలుగురుని పంపుతున్నాను". 

ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. 

ధర్మంగా సంపాదించి దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండే వారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు.

చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతోకాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. 

ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో... ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు. 

ఇది కుదరకపోతే అగ్ని దహించివేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. 

ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలోనో, లేక దొంగ రూపంలోనో వచ్చి వాడిని సర్వం హరించేస్తారు.

ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినదంతా రోగాలకో, రొష్టులకో తగలబెట్టేస్తారు.  

ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని పైన చెప్పిన 4 కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు.

కనుక నువ్వు నిర్భయంగా వెళ్లి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు.

ధర్మం తప్పిన నాడు నలుగురు నీకు తోడుగా ఉంటారు" అని వరమిచ్చి పంపించాడు.

Post a Comment

0 Comments