GET MORE DETAILS

యోగాభ్యాసం బౌద్ధుల సంప్రదాయం

 యోగాభ్యాసం బౌద్ధుల సంప్రదాయం



బుద్ధుడు వేద కాలానికి ముందు జీవించినవాడు. ఆయన ధ్యాన ముద్ర ప్రపంచానికి ఎప్పటి నుండో తెలుసు. ఆయనని 'యోగుల చక్రవర్తి' అని కూడా పిలుచుకున్నారు. వేదాలు రాయబడ్డ కాలానికి ముందే యోగ, ధ్యానం వంటివి ఉన్నాయి. శ్రమణులు, సాధువులు, రుషులు ఈ పద్ధతుల్ని ఆచరిస్తూ ఉండేవారు. ధ్యాన ముద్రలో వజ్రాసనంలో ఉన్న బుద్ధుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విషయం మనకు తెలుసు. పాళీ భాషలో యోగ/ ధ్యాన సాధనపై 'విశుద్ది మగ్గ' అనే బృహద్గ్రంథం ఉంది. యోగాభ్యాసం బుద్ధ సంప్రదాయానికి గర్వకారణం. నిజానికి 'యోగ ధ్యానం' - అంటే మనిషి తనతో తనకు గల సంబంధాన్ని అన్వేషించుకోవడం. బయట తిరిగేబదులు, ఎవరి లోపల వారు తిరగడం. మనుసుని అదుపులో పెట్టుకుని ఏకాగ్రతతో సాధన చేయడం. క్రోధం, ద్వేషం, దురాశ వంటి దుర్గుణాలను వదులుకుని, మనసుని శుద్ధి చేసుకోవడం. దానివల్ల జీవితంలో దుఃఖాలు దూరమవుతాయి. సుఖ శాంతుల వెలుగులు ప్రసరిస్తాయి. ఇది సాధించిన వారే శ్రమణులు, యోగులు, సాధకులు అవుతారు. యోగ ధ్యానానికి తథాగతుడు చాలా ప్రాముఖ్యమిచ్చాడు. ఆయన ధమ్మపదలో ఇలా చెప్పాడు...

యోగవే జయతి భూరి అయోగ భూరి సద్ఖ్యో

ఏతం ద్వేధ పథం జ్ఞాత్వా భవరు విభావరు చ!

(తత్‌ అత్తనం నివేశేయ - భూవిపద్ధతి)

అర్థం ఏమిటంటే, యోగాభ్యాసం వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఆచరించకపోతే ఉన్న వివేకం నశిస్తుంది. మనిషి పురోగతి, పతనం రెండూ అతని ఆధీనంలోనే ఉన్నాయి. నిరంతర జ్ఞాన సముపార్జనకు యోగధ్యాన సమాధిలో తమను తాము నిమగం చేసుకోవాలి.

ప్రజ్ఞ - అంటే అంతర్దృష్టి. విచక్షణ - దీనివల్ల కోరిక నశిస్తుంది. వస్తువుల మీద, బంధాల మీద అనురక్తి నశిస్తుంది. అప్పుడు గాని, బుద్ధని మార్గం అర్థం కాదు. వినయం, సమాధి, జ్ఞానం ఈ మూడింటి సమాహారమే - బుద్ధుని మార్గం! బుద్ధుని తర్వాత బోధి ధర్మ కుమార జీవ, వంటి బౌద్ధ భిక్షువులు ఈ ''భారతీయ సంస్కృతి''ని మొత్తం ఆసియా దేశాలకు వ్యాప్తి చేశారు. రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ప్రాణాలకు తెగించి, నెలలూ, సంవత్సరాలూ ప్రయాణించి, ప్రపంచ పౌరులెందరో నలందా తక్షశిల విశ్వవిద్యాలయా లకు వచ్చేవారు. విభిన్న విశ్వాసాలు ఉన్న ప్రజలు భారతదేశంలో బుద్ధుడికి ముందూ ఉన్నారు. బుద్ధుడి తర్వాతి కాలంలో కూడా ఉన్నారు. అయితే, యోగాభ్యాసాన్ని, ధ్యానాన్ని మాత్రం బుద్ధుణ్ణి అనుసరించే నేర్చుకున్నారు. కొందరు మాత్రం తాము నేర్చుకున్న వాటికి వారి స్వంత పైత్యాన్ని కొంత జోడిస్తూ వచ్చారు. మంత్రం, ప్రార్థన, శక్తి శాఖ వంటి వాటితో యోగను నింపేశారు. ఫలితంగా ఉపనిషత్తులు, యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార ధారణ వంటివి అందులో చేరాయి.

బుద్ధుణ్ణి దశావతారాల్లో చేర్చుకున్నట్టుగానే, బుద్ధుడి యోగాభ్యాసం, ధ్యానాలను వైదిక మతస్థులు మొదట స్వీకరించారు. తర్వాత కాలంలో పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు మనం నిత్య జీవితంలో వాడుతున్న 'యోగక్షేమాలు' - అనే పదం బుద్ధుడు చెప్పిన యోగాభ్యాసం నుండే వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న, వింటున్న యోగ సూత్రాలన్నీ బౌద్ధానంతర రచనలు. బౌద్ధాన్ని నాశనం చేసే క్రమంలో ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకున్నట్టుగానే, యోగాభ్యాసాన్ని కూడా మార్చేశారు. వాడుకలో ఉన్న ఇప్పటి యోగకు, ఒకప్పుడు బుద్ధుడు చెప్పిన యోగాభ్యాసానికి పోలికలు లేవు. బుద్దవిగ్రహాల రూపురేఖలు మార్చి, వైదికులు తమ దేవీ దేవతల్ని తయారుచేసుకున్నట్లు - యోగ సహజ స్వభావాన్ని, ఉద్దేశాన్ని వారు ధ్వంసం చేశారు. వ్యాపార ధోరణిలో నడుస్తున్న నేటి యోగ - మనసు శుద్ధికి ఏ మాత్రం ఉపయోగపడదు. శరీరాన్ని మెలితిప్పడం, ఉతికినట్లు శ్వాస పీల్చి వదలడం - ఇప్పుడు యోగగా చలామణి అవుతూ ఉంది. బుద్ధుడి ఊసు ఎత్తకుండా 'అంతర్జాతీయ యోగాడే' ప్రకటించినవాడు అసలు యోగా మూలాలు తెలుసుకున్నాడా? గుజరాత్‌ మారణహౌమానికి కారణమై వేల వేల మంది ప్రాణాలు బలితీసుకున్నవాడు - సంవత్సరానికి ఒకరోజు కళ్ళూ, ముక్కూ మూసుకుని అరగంట కూర్చుంటే యోగ ఫలితం దక్కుతుందా? స్వంత ఆలోచనలతో స్వంత నిర్ణయాలు తీసుకోలేనివారు కాపీ-పేస్ట్‌ చేస్తూ బతకాల్సిందే! వారికి మరో మార్గం ఉండదు. ఎప్పుడైనా, ఎక్కడైనా స్వంత మెదడుతో పనిచేసేవారికి మాత్రమే మార్గాలు దొరుకుతాయి. కాపీ కొట్టేవాడు ఎక్కడో ఓ చోట, ఎన్నడో ఓ నాటికి దొరికిపోవాల్సిందే! భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాలన్నీ మార్చబడిన జైన / బౌద్ధారామాలని తెలిసిపోలేదా? అలాగే యోగ కూడా బౌద్ధుల నుండి కాపీ కొట్టిందే అని స్పష్టమైపోయింది.

సరే, ఇక పతంజలి యోగ గురించి ఏమన్నాడో, అతను ప్రతిపాదించిన యోగ సూత్రాల సారాంశం ఏమిటో కూడా పరిశీలిద్దాం... చిత్తవృత్తి నిరోధం ద్వారా ఆత్మను పరమాత్మలో కలిపేందుకు 194 యోగ సూత్రాలు ప్రతిపాదించాడు - పతంజలి! విభూది పాదంలోని 17వ సూత్రం నుండి 40వ సూత్రం దాకా పరిశీలించినట్లయితే, మనకు ఎన్నో అభూత కల్పనలు కనిపిస్తాయి. యోగ చేసిన వారికి 1.సకల జీవుల భాషలు తెలుస్తాయని అన్నాడు. 2. శరీరం కనబడకుండా సంచరించవచ్చని చెప్పాడు. 3. మరణించిన పూర్వీకులతో మాట్లాడవచ్చని అన్నాడు. 4. భూత, భవిష్యత్‌ జ్ఞానం కలుగుతుందని అన్నాడు. 5. ఆకలి దప్పులు ఉండవని అన్నాడు. 6. ఏనుగంత బలం వస్తుందనీ, దివ్య శక్తులు లభిస్తాయనీ చెప్పాడు. 7. ఇతరుల శరీరంలోకి జొరబడొచ్చనీ అంటే పరకాయ ప్రవేశం చేయొచ్చనీ అన్నాడు... మరి ఇన్ని శతాబ్దాలలో వీటిలో ఏ ఒక్కటైనా, ఏ ఒక్కరి విషయంలోనైనా నిజమయ్యిందా? కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఇవన్నీ భ్రమలని, కల్పితాలనీ అర్థమవుతూ ఉంది కదా? దైవం, ఆత్మ, పరమాత్మ అని ప్రబోధించే వైదిక మంతంలోనే ఇవన్నీ ఇమిడిపోతున్నాయి - అసలు దైవం అంటూ ఎవరూ లేరు. ప్రతిదీ కార్యకారణ సంబంధంతో జరుగుతూ ఉంది. నిన్ను నీవు, నీ మనసును నువ్వు ఆధీనంలో ఉంచుకోవడానికి స్థిరచిత్తుడవై ఉండడానికి యోగాభ్యాసం మంచిదన్న బుద్ధుడి బోధనలకూ వైదిక మత ప్రచారాలకూ తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా?

తాము యోగ చేస్తున్నామని, దానివల్ల మనసూ, శరీరం ప్రశాంతంగా ఉంటున్నాయని ఈ రోజుల్లో ఎవరు చెపుతున్నారూ? సినీనటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కార్పొరేట్లు! అవి, సామాన్య జనాన్ని ప్రభావితం చేయడానికి చెప్పే కబుర్లే తప్ప - వీరిలో ఎవరైనా మనసుని నిశ్చలంగా ఉంచుకోగలుగుతున్నారా? కోరికలు లేని స్థాయికి చేరుకోగలుగుతున్నారా? వారి వారి వ్యాపారాలు పెంచుకోవడానికో, పబ్లిసిటీ పెంచుకోవడానికో, ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికో చేసే గిమిక్కులు తప్ప - బుద్ధుడు చెప్పిన యోగభ్యాస సారాంశం ఏ కొంచెమైనా వీరి మెదడుకు ఎక్కిందా? 'యోగ' అనే మాట వాడుకుని, లాభం పొందడం తప్ప - ఇప్పుడు వీరు చేస్తున్న ప్రచారాలకు అర్థమే లేదు. యోగ గురువుల పక్కన చేరి సినిమా నటీమణులు ఒళ్ళు విరుచుకుంటూ ప్రదర్శనలు ఇవ్వడం తప్ప - దాని వల్ల సామాన్య జనానికి ఏమిటీ లాభం? ఒక శుంఠ పక్కన మరో శుంఠ చేరి, ప్రజల మెదళ్ళను ఆకర్షించి, ఆధీనంలో ఉంచుకోవడానికి చేసే అతి తక్కువ స్థాయి ప్రయత్నం అది! దేశం బాధ్యత, ప్రజల బాధ్యత తీసుకున్నవాడు తను తప్పనిసరిగా చేయాల్సింది చేయకుండా సంవత్సరానికి ఓ రోజు వందమందిని వెనకేసుకుని, ముక్కు మూసుకుని కెమెరాలకు పోజులిస్తే అది ''యోగ-డే'' అయిపోతుందా? దానివల్ల జనం బాధలు ఏమైనా తగ్గుతాయా? సముద్రపు ఒడ్డునో లేక ఫుట్‌ పాత్‌ మీదో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు ఏరుతూ జనానికి వీడియోలు పంపితే... అది సుపరిపాలన అయిపోతుందా? ఈ యోగ విషయం కూడా అంతే! పదిమంది కెమెరా వాళ్ళను తీసుకుని వెళ్ళి తల్లి దగ్గర కూర్చునేవాడు, అటు తల్లి విలువను, ఇటు తన విలువనూ తగ్గించుకున్నవాడే అవుతాడు. అవసరమైంది తప్ప - పబ్లిసిటీ కోసం అనవసరమైనవి చేస్తే, వాటికి ఉన్న విలువ కూడా ఉండదు. యోగాభ్యాసమంటే ఏమిటో తెలుసుకోకుండా ఓ ''అంతర్జాతీయ యోగాడే'' ప్రకటించినవాడు అంతర్జాతీయ అజ్ఞాన శిరోమణిగా చరిత్రలో నమోదు చేయబడతాడు.

యోగను విమర్శించకండి! దాన్ని ఒక వ్యాయామంగా స్వీకరించవచ్చు కదా? అని సమకాలీనంలో కొందరు అంటూ ఉంటారు. నిజమే! వ్యాయామం మంచిదే!! అది శరీరానికి కొన్ని ప్రయోజనాల్ని సమకూరుస్తుంది. కానీ, మనసు నిర్మలం కాదు. అంతఃకరణ శుద్ధి జరగదు. అలా జరగనప్పుడు మానవ ప్రవృత్తిలో దురాశ, ద్వేషం, కోరిక వంటివి తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి. వ్యాయామం వల్ల ధృఢమైన శరీరం లభిస్తుంది అంతే. సమాజ శ్రేయస్సుకు నిర్మల మనస్కులు కావాలి. ప్రపంచం ఆనంద మయం, శాంతిమయం కావాలంటే, బుద్ధ మార్గంలో దుఃఖ విముక్తి కావాలి. అది సాధించడానికి బౌద్ధులు ఎంచుకున్న ఒక మార్గం ధ్యానం! ఈ అత్యాధునిక సమాజంలో ఇప్పుడు మార్పు కేవలం ధాన్యం చేస్తే కూడా రాదు - నిజమే! కానీ - సమాజ దుఃఖాన్ని కొంతలో కొంత తగ్గించడానికి కావల్సిన శ్రద్ధ, చిత్తశుద్ధి, సమర్పణ భావం అలవడుతాయి. మొత్తానికి మొత్తం కాకపోయినా, అత్యధికులు ఆస్థాయిని అందుకోగలిగితే, కొంతయినా మేలు జరుగుతుంది. భ్రమల్ని, అంధ విశ్వాసాల్ని వదిలేసి, వైజ్ఞానిక మానవవాద దిశగా ఏకాగ్రతతో అడుగులు వేయాలి. ఒక లక్ష్యంతో పనిచేయాలి! ఆ ఏకాగ్రత, ఆ లక్ష్య సాధనే ఇప్పుడు మనమంతా ఆచరణలో పెట్టాల్సిన - యోగ!

13 జూలై 2022న గురుపూర్ణిమ వచ్చింది. సార్‌నాథ్‌లో గౌతమ బుద్ధుడు తన శిష్యులకు, అనుచరులకు మొదటిసారి జ్ఞానబోధ చేసిన రోజు అది! కానీ, దాన్ని కూడా మనువాదులు దుర్మార్గంగా మార్చు కున్నారని చాలా మందికి తెలియదు. బౌద్దారామాల్ని ఆలయాలుగా మార్చుకున్న మనువాదులు గురు పూర్ణిమను కూడా మార్చుకున్నారు. 'గురుబ్రహ్మ, గురు విష్ణు వంటి శ్లోకాలతో గురువునే దైవం చేసేశారు. దేవుడు లేడని బుద్ధుడు చెపితే, ఆ ఆలోచనని ధ్వంసం చేశారు. జరిగిన తప్పిదాన్ని గ్రహించి, ఇప్పటి నుండైనా గురు పూర్ణి మను - బుద్ధుడి ''ధమ్మచక్క పవత్తన''గా జరుపుకుందాం!


- డాక్టర్‌ దేవరాజు మహారాజు/వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

Post a Comment

0 Comments