GET MORE DETAILS

కార్తీక పురాణం - 28 వ అధ్యాయము

కార్తీక పురాణం - 28 వ అధ్యాయము



● విష్ణు సుదర్శన చక్ర మహిమ

జనక మహారాజా ! వింటివా దుర్వాసుని అవస్ధలు ! తాను ఎంతటి కోపవంతుడైనను , వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున , ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా , ధర్మపాలకా ! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము , నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి , కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్దించితిని . ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు" మని అనేక విధాల ప్రార్ధించగా , అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి , "ఓ సుదర్శన చక్రమా ! నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో , తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన , ఈతనిని చంపవలదు , ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని , ముందు నన్నుచంపి , తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి , నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు , దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా ! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు , నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును , శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి "ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా ! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు , మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు ఏకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ! ఈ లోకములో దుష్టశిక్షణ , శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే , ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి , నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి , ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని , శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను , కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి , శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి , " నేను దేవ గో , బ్రాహ్మణాదులయుందును , స్త్రీలయందును , గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా అభిలాష. కాన , శరణుగోరిన ఈ దుర్వాసుని , నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు , కోట్ల కొలది సూర్య మండలములు ఏక మైననూ నీ శక్తీకి , తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి , వారిని శిక్షించి , తన కుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన , నికివే నామనఃపూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా ! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో , ఎవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో , ఎవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబట్టక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి , ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన , నిన్నూ , దుర్వాసుని రక్షించుచున్నాను , నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు. అని చెప్పి అతన్నీ ఆశీర్వదించి , అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

Post a Comment

0 Comments