GET MORE DETAILS

మన భద్రత కోసం (మార్చి 04 - జాతీయ భద్రతా దినోత్సవం)

 మన భద్రత కోసం (మార్చి 04 - జాతీయ భద్రతా దినోత్సవం) 




యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

ఆధునిక కాలంలో మన జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి.మానవ జీవితంలో వేగం పెరిగింది.నలుగురు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయింది.ఇదే క్రమంలో వ్యక్తిగత భద్రత తగ్గుతుంది.పనిచేసే ప్రదేశంలో భద్రతను పెంపొందించడానికి ప్రతిఏటా మార్చి4 న జాతీయ భద్రతా దినోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా "నేషనల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ క్యాంపేన్" మార్చి 4 నుండి వారంరోజులు చేపట్టతారు. ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవనవిధానంలో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక అంతర్గత భాగంగా మలుచుకునేలా చేయడం ఈ క్యాంపెన్ లక్ష్యం.

భారత ప్రభుత్వం, శ్రామిక మంత్రిత్వ శాఖ(లేబర్ మినిస్ట్రీ) 1966 మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా మండలి(నేషనల్ సేఫ్టీ కౌన్సిల్)ని స్థాపించింది. భద్రత, ఆరోగ్యం పర్యావరణాలపై అవగాహన పెంపొందించడం ఈ మండలి లక్ష్యం. సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లతో పాటు సేఫ్టీ ఆడిట్లు వంటి కార్యక్రమాలను ఈ మండలి నిర్వహిస్తుంది.భద్రతా మండలి అధ్వర్యములోనే --" రహదారి భద్రతా దినోత్సవాలు , అగ్నిమాపక వారోత్సవాలు , ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు " నిర్వహిస్తారు .

ప్రతిరోజూ పత్రికల్లో కనిపించే వార్త రోడ్డు ప్రమాదం . మన దేశములో ప్రతియేటా దాదాపు 60 వేల మంది లక్షమంది వరకు రోడ్డు ప్రమాదాలకు గురుయైమరణించడం ,తీవ్రముగా గాయపడడం జరుగుతున్నది .ఈ రోడ్డు ప్రమాదాలలో అత్యధికం మానవ తప్పిదాలవల్ల జరుగుతున్నవే. వాహనదారులు అతివేగం గా నడపడం , రహదారుల మీద నడిచేవారు చూపే నిర్లక్ష్యం వంటివి ఈ ప్రమాదాలను సృష్టిస్తున్నాయి.

వీటితో పాటుగా కర్మాగారాలలో జరిగే ఇతర ప్రమాదాలు , అగ్నిప్రమాదాలు వంటివి నిత్యం సంభవిస్తున్నాయి. పనిచేసేందుకు వెళ్ళినవారు తిరిగి క్షేమం గా ఇండికి వస్తారో ... రారో అన్నఆందోళనతో కుటుంబ సభ్యులు బతకాల్సివస్తుంది. కుటుంబ పెద్దకు ప్రమాదము జరిగినా .. ప్రమాదము లో మరణించినా ఇక ఆ కుటుంబము మొత్తము కోలుకోనివిధం గా దెబ్బతుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భద్రతను పాటించాలి. ప్రరి కార్మికుడూ తాను తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే , సూచించిన పద్దతులను పాటిస్తే ప్రమాదాలు సంభవించవు. స్వాతంత్రం రాకముందు మన దేశము లో పారిశ్రామికీకరణ అంతంత మాత్రమే ,  ఆ తరువాత పెరిగిన పరిశ్రమలతో పాటు ప్రమాదాలూ పెరగడం మొదలైనది.

 ప్రముఖ పారిశ్రామిక కేంద్రము ముంబై లో కార్మికుల భద్రత గురించి చర్చ 1962లో మొదలైనది . 1962 లో జరిగిన రాస్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశములో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది . ప్రమాదాల పట్ల అప్రమత్తత పెంచాలంటే ప్రచారము అవసరమని , అందుకు దానిని నిర్వహించడానికి , కార్మికులలో భద్రతపట్ల అవగాహన పెంచేందుకు ప్రబుత్వపరం గా ఒక సంస్థ అవసరమని గుర్తించారు. ఆ తర్వాత పారిశ్రామిక భద్రత మీద తొలి సమావేశము 1965 లో ఢిల్లీ లో నిర్వహించారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు , కార్మిక సంఘాలు , ఉద్యోగ సంఘాలు , పలు సంస్థలు పాల్గొన్న ఆ సభలో జాతీయ , రాష్ట్ర స్ఠాయిల్లో భద్రతామండలి ప్రారంభించాలని నిర్ణయించారు. డిసెంబర్ లో ఆ సమావేశము జరుగగా .. మార్చి 04 -1966 న జాతీయ భద్రతామండలి రూపు దిద్దుకున్నది . కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆ మండలి ప్రారంభమయిన మార్చి 04 నే జాతీయ భద్రతా దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు . ఆ రోజు నుండి వారం రోజులు పాటు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు . స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ఈ సంస్థ భద్రత , ఆరోగ్యము , పర్యావరణ అంశాలను దేశములోని వివిధ ప్రాంతాలకు చేరవేయడం ప్రధాన లక్ష్యం గా పెట్టుకుంది. పారిశ్రామిక రంగానికి చెందిన వారినందరినీ ఇందులో భాగస్వాములను చేయడం రెండవ లక్ష్యము . భద్రత కల్పించడంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రను గుర్తెరిగి అనుసరింపచేసేందుకు ఈ సంస్థ కృషిచేస్తుంది .

ప్రతి పనిలోను ఏదో ఒక ప్రమాదము పొంచివుంటుంది . కొన్ని రకాల ప్రమాదాలు ముందుగా పసిగట్టలేము . కానీ ప్రమాదాలలో అధికశాతము అజాగ్రత్తవల్ల సంభవించినవే . అవి రహదారి ప్రమాదాలైనా , పారిశ్రామిక ప్రమాదాలైనా ఒకటే . నానాటి ప్రమాదాల సంఖ్య పెరుగున్నందున పారిశ్రామిక , రహదారి భద్రతల మీద దృష్టి పెంచారు . ప్రాణనష్టం అధికం గా ఉన్న ఈ రంగాలతో పాటు అగ్ని ప్రమాదాల నివారణ గురించి కూడా ప్రచారము నిర్వస్తారు . పారిశ్రామికవేత్తలు కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లు , కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలును వివరించి , వాటిని అమలుజరిగేలా ప్రచారాన్ని భద్రతా వారోత్సవ సందర్భముగా నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments