GET MORE DETAILS

అభిజిత్ నక్షత్రం ఎలా పుట్టింది ?

అభిజిత్ నక్షత్రం ఎలా పుట్టింది ?



జ్యోతిష్యశాస్త్ర ప్రకారం అభిజత్‌ ముహూర్తం ప్రతీరోజూ వస్తుంది. ఈ అభిజిత్‌ ముహూర్తంలో చేసే పనులలో దోషాలు నివృత్తి చేస్తున్నాయని శాస్త్రాలు తెలియచేసాయి. అంటే అభిజిత్‌ ముహూర్తం సర్వదోష నివారణం అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అయితే అభిజిత్‌లో అలా అని అన్ని కార్యక్రమాలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది.

అభిజిత్‌ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతిలేనిదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు. అనేక నక్షత్రాల సమూహం. అభిజిత్‌ నక్షత్రం విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం శ్రవణా నక్షత్రంలోని మొదటి 15 ఘడియలు కలిపి అభిజిత్‌ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీనారాయణాతృకమైనది. ఉత్తరాషాఢ మహాలక్ష్మీ సంబంధం. శ్రవణం నారాయణ సంబంధం. అందుచేతనే దీనికి విజయప్రదమని పేరు. మధ్యాహ్నంలో నాలుగవ లగ్నం అభిజిత్‌ అని అంటారు. ఈ నక్షత్రం వెనుక ఓ పురాణ కథ ఉందని అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అభిజిత్ నక్షత్రం ఎలా వచ్చింది ?

మనకున్న 27 నక్షత్రాలనూ దక్షప్రజాపతి కుమార్తెలుగా చెబుతారు. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి పేమ ఎక్కువ. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచుతుంది. తండ్రి దగ్గరకు వెళ్లి చంద్రుడి సంగతి తేల్చాలనుకుంటుంది. శ్రవణా నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. ప్రతి రోజూ ఈ నక్షత్రానికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్‌ ముహూర్తం అంటారని అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అభిజిత్‌ పదం ఒకప్పుడు పల్లెటూళ్లకు కొత్త కాదు. కాలం మారింది కాబట్టి ఇప్పుడది అంతగా వినపడటం లేదు. గడ్డపలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్ట మధ్యాహ్నం అన్నమాట. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని , ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం.

ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమిపూజను ఈ అభిజిత్‌ లగ్నంలోనే చేశారంటే దీనికున్న ప్రాధాన్యం ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మధ్యాహ్నం 11-45 నుండి 12-30 వరకు ఉండే ఈ ముహూర్తాన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తంలో దేవతలు సముద్ర మథనం ప్రారంభించారు. ఈ శుభ ముహూర్తం లోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముడి జననం , సీతారాముల కల్యాణం , భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం. ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి. ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభ కార్యం చేపట్టినా , ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు.

అభిజిత్ ముహూర్త ఆంక్షలు:

నారద సంహిత ప్రకారం అభిజిత్ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని చిలకమర్తి తెలిపారు. దక్షిణం యమస్థానం కాబట్టి బుధవారం మాత్రం అ దిక్కుకు వెళ్లరాదని సూచించారు. అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని నారద సంహిత పేర్కొంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్‌ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు.

వశిష్ట సంహిత ప్రకారం సూర్యుడు చీకటిని ఎలా పారదోలతాడో అలా సర్వదోషాలనూ ఈ ముహూర్తం హరించి వేస్తుంది. ముహూర్త వల్లరి ప్రకారం అభిజిత్‌ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికిరాదు. కాగా ఈ లగ్నంలో వివాహం చేయకూడదని బ్రహ్మ శపించినట్లు నారద సంహిత విశదీకరించింది. ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అభిజిత్‌ లగ్నం ఉపనయనానికి తప్ప వివాహాది సమస్త శుభకార్యాలకు శ్రేష్టమని , సర్వశ్రేయోదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

Post a Comment

0 Comments