GET MORE DETAILS

శివార్పణ ఫలితం...!

 శివార్పణ ఫలితం...!

            


తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో ‘నాగపట్నం’ అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు. ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజున ఉత్సవం చేస్తారు.

ఈ జాలరి వాడికి ఒక దినచర్య. అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని ‘శివార్పణం!’ అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు.

ఇప్పుడు మనం దుకాణాలలో చూసినా మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీలు జనాలకి పెడుతూ ఉంటారు. ఇతను భక్తిగా చేశాడు. ఇతని బ్రతుకులో తెలిసినదంతా శివార్పణం.

నిజానికి భక్తి అంటేనే శివార్పణం. శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింపజేస్తుంది. శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది. శివభక్తి, శివప్రేమ, శివార్పణం ఇలాంటి మాటలు. ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం!

అటు తర్వాత చేపలు పట్టుకొనేవాడు. ఇతడు జాలరి వాళ్ళకు నాయకుడు. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే. ఒక కట్టు ఉండాలి. ఒక పద్ధతి ఉండాలి గనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఈనాయకుడిగా ఉంటూ ఉంటే అందరూ హాయిగా ఉన్నారు. మత్స్యసంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు. 

ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు. ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతోదూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్యభోజనాలకీ, కుటుంబపోషణలకీ అయిపోయాయి.

చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఇళ్ళల్లో పొయ్యి వెలగట్లేదు. ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు. ఈ పెద్దాయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది.

దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు. ఈ చేపని కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీనినుంచి వచ్చేది మరి ఎప్పుడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది.

కానీ ఇతనికున్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం.పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప.

ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు. మొదటిది శివార్పణం అని వేయడం అలవాటు. నాయకుడు కాబట్టి వద్దు అనలేరు. అప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన  కలిగినది,  వీళ్ళందరికీ. వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమౌతుందో అని భయం లేదు. మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజూ శివార్పణం చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు.

అదీ భక్తి అంటే…!

ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది. మిగిలిన వారికి సంపద లేదే అని బాధ. ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్ళకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్ళంతా పులకించిపోయింది. కళ్ళవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి.

పైకి తీశాడు ఆ చేపని. వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకున్నారు పారేయకు అని! వీళ్ళెవరూ పట్టట్లేదు అతనికి. ఆ శివుడికి అర్పిస్తున్నాను అని తీసుకొని ‘శివార్పణం’ అని సముద్రంలో వేశాడు.

వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజమధ్యంలో వృషభవాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి “సంతోషించాను!” అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు.

’ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం!’ అని చెప్పడం. ‘స్వయం తీర్త్వా పరాన్ తారయతి’

తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు.

ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది.

ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవమూర్తియై ఇక్కడికి తెస్తారు.

ఆ జాలరి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది.

భారతదేశం అంతా ఈ దృష్టితో వెతకాలి, తిరగాలి. భగవంతుడిని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి.

ఇలా ఈ మహానుభావుని ‘శివార్పణం’ కథ చెప్పుకున్నాం. దీనిని భావించినట్లయితే ‘అర్పణ బుద్ధి’ అంటే ఏమిటో తెలుస్తున్నది.

కొంతమంది భగవంతుడి దయవల్ల సంపాదించి మాటిమాటికీ అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడని. కానీ ఎంత ఉన్నా ఇచ్చింది ఏమౌతుందో అనే భయం వాళ్ళకి. ఒకళ్ళకి ఇవ్వడానికి, దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు.

’అర్పణకి’ సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి.

కనుక అర్పించేదే నీది, దాచుకున్నది నీదికాదు. తరువాత ఎవడిదో అవుతుంది. ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యము, త్యాగనిరతి, ఏర్పడి నీతి, నిజాయితీ అభివృద్ధి చెందుతాయి.

ఇలాంటి  నిజ జీవిత గాధలను చిన్నప్పటినుంచీ తెలియజేసినట్లయితే పిల్లల్లో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి.

భగవత్కథ వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి.

భగవంతుడు ఒక తల్లిదండ్రులకంటే ఎక్కువగా కనురెప్పలా కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన చరిత్రలు చాలా వున్నాయి.

            ఓం నమ:శ్శివాయ:

Post a Comment

0 Comments