GET MORE DETAILS

శఠగోపము ఎప్పటి నుండి ఆచారమైంది ?

 శఠగోపము ఎప్పటి నుండి ఆచారమైంది ?



శఠగోపము పెట్టడము, కైంకర్యము చేయడము, స్వాహచేయడము, నీ పనిగోవిందా ! నెత్తిన చేయి పెట్టడము, ఏమిటీ నీ రామాయణం, నీ రామాయణము ఆపి వెళ్లి పనిచూడు, భజనలు చేయడము, చెవిలో పువ్వు పెట్టడము, పంగనామాలు పెట్టడము, చాల్లేగాని   చిడతలు వాయించడము ఆపు, దక్షిణలు సమర్పిస్తేనే మా నాయకుడు పనిచేస్తాడు.

ఇవన్ని చదువుతుంటే మీకేమని పిస్తోంది ? నాకైతే మన పురాణాలను, పురాణపురుషులను, హిందూ సంస్కృతిని మనమే బాగా ఎగతాళి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

హిందూమతాన్ని హిందువులు అవమానించినంతగా ఇతరులు అవమానించరేమోనని నా అభిప్రాయం.

పైవాటిలోని వాటిలో  శఠగోపమును మోసము చేయడము, మాటతప్పడము, దుర్వినియోగము చేయడమనే నీచార్థమాటలతో మనం ఉపయోగిస్తున్నాము.

ఉదా॥ ప్రజలకు శఠగోపము పెట్టిన ముఖ్యమంత్రి.

దేవుడికే శఠగోపము పెట్టిన ఆలయధర్మకర్త.

శఠగోపము గుండ్రని పంచలోహపాత్ర. దైవదర్శనము అనంతరము ఆలయపూజారి భక్తుల శిరస్సుపై శఠగోపాన్ని వుంచి ఆశీర్వచనము పలుకుతాడు.అప్పుడు భక్తుడు తన మనసులోని కోరికలు దేవుడికి నిశ్శబ్దంగా నివేదించి, భక్తిపారవశ్యము చెందుతాడు. 

 పన్నిద్దారాళ్వారులు అనగా పడ్రెండుమంది ఆళ్వారులు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవాన్ని ప్రచారము చేసిన మహపురుషులు, సాక్ష్యాత్తు దైవస్వరూపులని శ్రీవైష్ణవ భక్తుల నమ్మకము.

వీరు పాశురాలను రచించి గానముచేసి శ్రీవైష్ణవభక్తి ఉద్యమాన్ని బలోపేతము చేశారు. ఈ పాశురాలకే దివ్యప్రబంధాలని, నాలాయిరమని, ద్రవిడవేదమని పేరు. వీటి సంఖ్య నాలుగు వేలు.

ప‌న్నిద్దరు ఆళ్వారులు ఎవరంటే...

(1) పొయ్‌గయాళ్వార్  

(2) పూదత్తాళ్వార్  

(3) పేయాళ్వార్ 

(4) పెరియాళ్వార్  

(5) తిరుమళిశై యాళ్వార్ 

(6) కులశేఖరాళ్వార్  

(7) తిరుప్పాణ్‌ఆళ్వార్ 

(8) తొండరడిప్పొడి యాళ్వార్ - 

(9) తిరుమంగయాళ్వార్  

(10) ఆళ్వారుక్కు అదియాన్ లేదా రామానుజాచార్యులు

(11) ఆండాళ్  

(12)  నమ్మాళ్వార్ ఇతనికిగల మరొక పేరు శఠకోపముని.

అళ్వారులు కులవ్యవస్థను తిరస్కరించి మనుష్యులందరూ సమానమనే భావనను ప్రచారము చేశారు. భక్తికి కులమేందుకు మనుషులలో అంటరానితనమేమిటని గళమెత్తిన ప్రశంసనీయులు ఈ ఆళ్వారులు.

● వీరిలో నాలుగవవాడైన తిరుమళిశై ఆళ్వార్ పుట్టుకరీత్యా పంచముడు.

● తిరుమంగ యాళ్వార్ శూద్రుడు.

●>తొండరడిప్పొడి యాళ్వార్ తోటమాలి, ఇతనికే  విప్రనారాయణుడని పేరు.

● తిరుప్పాణ్ ఆళ్వార్ పుట్టుకతో అంటరానికులము వాడు.

● నమ్మాళ్వార్ శూద్రుడు.

నమ్మాళ్వార్  ఇతనికిగల మరొక పేరు శఠకోపముని. ఇతను పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది,శ్రీవైష్ణవదీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకు అందరికి  అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో శఠగోపం పెట్టడం అనేది ఈ శఠకోపముని పేరుమీద మొదలయిన ఆచారమే.నమ్మాళ్వార్  తన జీవితకాలం అంతా చింతచెట్టు క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.

ఇతడు యోగాభ్యాసపరుడు. ఇతనికి నాధముని, మధురకవి అనువారు శిష్యులు. ఇంకా శైవ వైష్ణవ వైషమ్యాలు ఇతని కాలములో బాగా క్షిణించిపోయాయి.

Post a Comment

0 Comments